వివాదంలో కరీనా కపూర్‌ పుస్తకం, నటిపై ఫిర్యాదు

14 Jul, 2021 19:46 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్‌కు ఆమె ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. దీంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్‌ సంఘాలు కరీనా బుక్‌ టైటిల్‌ను వ్యతిరేకిస్తూ శివాజీ నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. కరీనాతో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు.

అల్ఫా, ఒమెగా క్రిస్టియన్‌ మహాసంగ్‌ అధ్యక్షుడు ఆశిష్‌ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్‌లోని శివాజీ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఇంచార్జ్‌ శ్రీనాథ్‌ తంభోర్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కరీనాతో పాటు ఈ బుక్‌ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జని, బుక్‌ పబ్లిషర్‌ సంస్థ జాగ్గర్‌ నట్‌ బుక్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ షిండే తన ఫిర్యాదులో కరీనా కపూర్‌ బుక్‌ టైటిల్‌ క్రిస్టియన్‌ల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ను అవమానించేలా ఉందని, ఇది క్రిస్టియన్‌ మనోభవాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నట్లు చెప్పారు. అంతేగాక కరీనాతో పాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 295-ఏ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారన్నారు. అయితే దీనిపై కంప్లైట్‌ తీసుకున్నాము కానీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆయన అన్నారు. 

ఇది ముంబై పరిధిలోకి వస్తుందని, తమ స్టేషన్‌ పరిధిలోకి రాదని ఆయనకు స్పష్టం చేసినట్లు సదరు అధికారి అన్నారు. దీంతో షిండే ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా ఆయనకు సలహా ఇచ్చామన్నారు. కాగా కరీనా తను రాసిన బుక్‌ను జులై 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్‌ను విడుదల సందర్భంగా కరీనా మాట్లాడుతూ.. ఈ బుక్‌ తనకు బిడ్డతో సమానం అని, ఇది తన మూడవ బిడ్డ అంటూ వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ బుక్‌ను సోషల్‌ మీడియా ప్రమోట్‌ చేస్తూ ఇందులో తను గర్భవతిగా ఉన్నప్పుడు భౌతికంగా, మానసికంగా ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొందో వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యింది. కాగా ఇటీవల కరీనా రెండవ బిడ్డకు జన్మినించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు