సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంపై పోలీసుల ప్రకటన

11 Sep, 2021 22:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నటుడు సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌  కొనుగోలు చేశారని మాదాపూర్‌ డీసీపీ వెల్లడించారు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని, బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్‌ డీసీపీ పేర్కొన్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రయాణించిన బైక్‌పై గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌ వెళ్లినందుకుగాను రూ.1,135 చలాన్‌ వేశమన్నారు. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ కుటుంబసభ్యులు క్లియర్‌ చేశారని తెలిపారు.  

రోడ్డు ప్రమాదం జరిగిన  సమయంలో బైక్‌ 78 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌ రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌డై సాయిధరమ్‌ తేజ్‌  కిందపడ్డాడని పోలీసులు వెల్లడించారు. తేజ్‌ నుంచి టూవీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేవలం లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందన్నారు. ప్రమాదం సమయంలో హెల్మెట్‌ ధరించి ఉన్నాడని  మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. 

చదవండి: సాయి అలాంటి వాడు కాదు, వదంతులు పుట్టించకండి: లక్ష్మీ మంచు

మరిన్ని వార్తలు