అరవై రోజుల ఆనందం

28 Feb, 2021 05:54 IST|Sakshi

షూటింగ్‌ షెడ్యూల్స్‌ అనుకున్నట్లు సజావుగా జరిగితే చిత్రబృందం ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ యూనిట్‌ ఆ ఆనందంలోనే ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ భారీ పీరియాడికల్‌ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ ముగిసింది. దాదాపు అరవై రోజులుగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌లో తీసినవాటిలో విక్రమ్‌–ఐశ్వర్యా రాయ్‌పై కీలక సన్నివేశాలు ఉన్నాయని, ప్రధాన తారాగణమంతా పాల్గొన్న ఓ పాట ఉందని సమాచారం. కార్తీ, ‘జయం’ రవి, శరత్‌కుమార్, అర్జున్, త్రిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ‘సఖి’ ఫేమ్, నటుడు అజిత్‌ భార్య షాలిని కీలక పాత్ర చేస్తున్నారట. కాగా, హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగిసిన విషయాన్ని సినిమా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఏకా లఖానీ తెలిపారు. ‘‘రాక్షస షెడ్యూల్‌ ముగిసింది. ఈ కోవిడ్‌ టైమ్‌లో ఇంత పెద్ద షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేయగలిగామంటే నమ్మకలేకపోతున్నాం’’ అన్నారు ఏకా. రెండు భాగాలుగా ఈ సినిమాని ప్లాన్‌ చేశారు మణి రత్నం.

మరిన్ని వార్తలు