కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌

10 May, 2021 10:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్‌ అయిన టీఎన్‌ఆర్‌ కరోనా రక్కసికి బలయ్యారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.


అయితే చికత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. టిఎన్ఆర్‌కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక టీఎన్‌ఆర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు