GG Krishna Rao Passed Away: టాలీవుడ్‌లో మరో విషాదం..శంకరాభరణం, బొబ్బిలి పులి చిత్రాల ఎడిటర్‌ కన్నుమూత

21 Feb, 2023 09:23 IST|Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారకరత్న మరణాన్ని మరవకముందే మరో సినీ దిగ్గజం కన్నుమూయడం విచారకరం. టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌ పని చేసిన జీజీ కృష్ణారావు(87) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా జీజీ కృష్ణారావు పలు భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగులో దాసరి నారాయణరావు, కళాతపస్వి కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల సినిమాలకు పని చేసి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. కె విశ్వనాథ్‌ క్లాసికల్‌ హిట్స్‌ ‘‘శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభలేఖ, శృతి లయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం’’ సినిమాలకు ఎడిటర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం.

అలాగే దర్శక రత్న దాసరి నారాయణ రావు  ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకు కూడా పని చేశారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలతో ఆయన ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నారు ఆయన.

చదవండి: 
నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు