‘ఆదిపురుష్‌’ డేట్‌ ఫిక్స్‌

20 Nov, 2020 03:11 IST|Sakshi

షూటింగ్‌ ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టనే లేదు.. అప్పుడే తెరపైకి సినిమాని తెచ్చే తేదీని కూడా ఫిక్స్‌ చేసేసింది ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు. టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మించనున్న ఈ సినిమాతో ప్రభాస్‌ బాలీవుడ్‌లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన రాముడి పాత్ర పోషించనున్నారనే సంగతి తెలిసిందే.

‘‘ప్రతీ పాత్రకు ఒక్కో ఛాలెంజ్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నేను చేయబోయే పాత్రకు ఛాలెంజ్‌తో పాటు చాలా బాధ్యత కూడా ఉంది’’ అని ఈ సినిమాని ప్రకటించినప్పుడే ప్రభాస్‌ అన్నారు. ఈ పాత్ర కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టారని టాక్‌. భారీ బడ్జెట్‌తో త్రీడీ చిత్రంగా రూపొందనున్న ‘ఆదిపురుష్‌’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ ప్రారంభిస్తారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరిన్ని వార్తలు