Prabhas: నిర్మాతకు రూ. 100 ఇచ్చిన ప్రభాస్‌..

3 Aug, 2022 21:27 IST|Sakshi

Prabhas Interesting Comments In Sita Ramam Pre Release Event: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్‌ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 

ఈ కార్యక్రమంలో భాగంగాలో స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్‌ మొదట ఏం మాట్లాడను అని షాక్‌ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్‌ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని చెప్పాడు డార్లింగ్‌. 'ప్రభాస్‌ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు' అని స్వప్న దత్‌ తెలిపారు. అనంతరం స్వప్న దత్‌ మాట్లాడకా ఆమె కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని నవ్వులు పంచాడు. 

''ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్‌లో చూడండి'' అని ప్రభాస్‌ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్‌ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. 'నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్‌ వద్ద అడిగి తీసుకున్న' అని ప్రభాస్‌ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్‌ తీసుకున్నాడు ప్రభాస్. 'సీతారామం' చిత్ర యూనిట్ అంతా టికెట్‌తో పాటు ఫొటోలకు ఫోజులివ్వడంతో ఈ ఈవెంట్‌ ముగిసింది.  

మరిన్ని వార్తలు