ఇండియాలో అడుగుపెట్టిన ప్రభాస్‌

7 Nov, 2020 17:23 IST|Sakshi

యంగ్‌ రెబెల్‌ స్టార్‌ అని తెలుగువాళ్లు ప్రేమగా పిలుచుకునే ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. బాహుబలి, సాహో లాంటి భారీ బడ్జెట్‌ బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్‌ ఇటీవల ఇటలీలో ఒక షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆ షూటింగ్‌లోనే ప్రభాస్‌ తన పుట్టినరోజును కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నెల రోజుల పాటు సాగిన షెడ్యూల్‌ పూర్తి కావడంతో ప్రభాస్‌ తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టారు. శనివారం రాత్రి ఆయన ముంబాయ్‌ ఎయిర్‌పోర్టులో కనిపించారు.

మెటాలిక్‌ గ్రే జాకెట్‌తో క్యాప్‌ పెట్టుకొని, ఫేస్‌ మాస్క్‌ ధరించి ఉన్న ప్రభాస్‌ సింపుల్‌గా ఉన్నా స్టైలిష్‌గా ఉండడంతో ఆయనను కెమెరాలతో క్లిక్‌మనిపించారు ఫోటోగ్రాఫర్లు. ప్రభాస్‌ పక్కన ఆయన బాడీగార్డ్‌, మేనేజర్‌ తప్ప ఇంకేం హడావిడీ లేదు. ఇది చూస్తే చెప్పొచ్చు ప్రభాస్‌ సింపుల్‌గా ఉండడానికి ఎంత ఇష్టపడతాడో..  ప్రభాస్‌ వీకెండ్‌ ముంబాయ్‌లోనే గడిపి ‘ఆదిపురుష్‌’ సినిమాకు సంబంధించి ఓం రౌత్‌ను కలవనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది ముగిసిన తర్వాత త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి రాధే శ్యామ్‌ చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్‌ వేయనున్నారట. ‘మోస్ట్‌ ఎలిజిబిల్‌ బ్యాచిలర్‌’ సినిమా కోసం ప్రభాస్‌ కంటే మందే యూరప్‌ నుంచి వచ్చేశారు పూజా హెగ్దే.    (వకీల్‌ సాబ్‌ సెట్‌లో అడుగుపెట్టనున్న శృతి)

షూటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రభాస్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పుట్టినరోజున మూవీ టీమ్‌ ప్రత్యేకంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ కారుపై కూర్చొని ఉన్న ఫోటోను విడుదల చేశారు. అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. 1920ల్లో పారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఒక అందమైన ప్రేమకథ రాధే శ్యామ్‌. దీన్ని జిల్‌ మూవీ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, సాషా చత్రి, కునాల్‌ రాయ్‌ కపూర్‌, సత్యలాంటి సీనియర్‌ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ సంస్థలు రాధే శ్యామ్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  (వెబ్‌ సిరీస్‌లతో నిర్మాతగా..)

మరిన్ని వార్తలు