ఓటీటీలో విడుదల కానున్న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, కానీ..

2 May, 2021 17:39 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ సినీరంగంపై పిడుగులాపడింది. సినిమా భాషలో చెప్పాలంటే.. కరోనా విలన్‌లా మారి సినిమా పరిశ్రమపై దాడి చేస్తోంది. ఈ మహామ్మారి కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఇక ఇప్పటికే షూటింగ్‌లు పూర్తి చేసుకున్న కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నాయి. కానీ పెద్ద సినిమాల పరిస్థితి అలా కాదు. ఓటీటీలలో విడుదల చేస్తే లాభాల మాట ఏమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా రాదు. పోనీ విడుదల వాయిదా వేద్దామనుకుంటే.. భారీ బడ్జెట్‌ కారణంగా అదీ వీలుకాదు. ఇలాంటి తరుణంలో కొత్త విధానాలను వెతుక్కుంటున్నాయి. పే పర్‌ వ్యూ విధానంతో ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే: ది మోస్ట్‌ ఆంటెడ్‌ భాయ్‌’ ధియేటర్లతో పాటు ఓటీటీల్లో పేపర్‌ వ్యూ విధానంలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. మే 13న ఈ సిసిమా విడుదల కానుంది. థియేటర్లకు వెళ్లలేని వారు కొంతమొత్తంలో డబ్బులు చెల్లించి మొబైల్‌లోనే సినిమా చూడొచ్చన్నమాట. తాజాగా సల్మాన్‌ఖాన్‌నే ఫాలో అవుతున్నారు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. తన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ని ఓటీటీ వేదికగా ఫే పర్‌ వ్యూ విధానంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 

 ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ.. ఈ సినిమాని తెరకెక్కించాడు. పూజా హెగ్డే హీరోయిన్. దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమాని జూలై 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ప్రకటించింది. అప్పటికి పరిస్థితులు మెరుగై థియేటర్లు తెరుచుకుంటే.. సినిమాను యధావిధిగా థియేటర్లలోనే రిలీజ్ చేసే యోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. లేని పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో పే పర్‌ వ్యూ విధానంలో విడుదల చేస్తారని టాక్‌. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.  మరి ‘రాధేశ్యామ్’.. ‘రాధే’ని ఫాలో అవుతాడా.. లేదా తన రూట్‌లోనే వెళ్తాడా అని వేచి చూడాలి.


చదవండి: 
రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా..
ఇష్టమైన బైక్‌ను అమ్మకానికి పెట్టిన 'ఫిదా' నటుడు

మరిన్ని వార్తలు