క్వారంటైన్‌లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌

23 Apr, 2021 01:04 IST|Sakshi

హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు హీరో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌. ఫ్యాన్స్‌ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కోవిడ్‌ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్‌బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు మహేశ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్‌ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్‌చరణ్‌లు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు.

మొన్నటివరకు ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రభాస్‌. కాగా ప్రభాస్‌ మేకప్‌మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్‌. దీంతో ఆయన హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొన్నారు. రామ్‌చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్‌ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్‌చరణ్‌ కూడా క్వారంటైన్‌లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్‌ హీరోలు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు