Adipurush 3D Teaser: 3డీలో టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను : ప్రభాస్‌

7 Oct, 2022 10:43 IST|Sakshi

‘‘ఫస్ట్‌ టైమ్‌ ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను 3డీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడిని అయిపోయాను. 3డీ ఫార్మాట్‌లో నేను కనిపించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది.. థ్రిల్‌ అయ్యాను’’ అని హీరో ప్రభాస్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణ ఇతిహాసం ఇతివృత్తం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భషణ్‌ కువర్, క్రిషణ్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘ఆదిపురుష్‌’ 3డీ టీజర్‌ను ప్రదర్శించారు. ప్రభాస్‌ మాట్లాడుతూ – ‘‘ఇండియాలో ఇప్పటివరకు వాడని టెక్నాలజీతో ‘ఆదిపురుష్‌’ తీశాం. బిగ్‌ స్క్రీన్‌ కోసం తీశాం’’ అని అన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘ఆది పురుష్‌’ టీజర్‌ ఎలా ఉందని నన్ను కొంతమంది అడిగారు. బాగుందని చెప్పాను. కానీ నా సిబ్బందిలో కొందరు ‘ఆదిపురుష్‌’ టీజర్‌ అలా ఇలా అని అనుకుంటున్నారని చెప్పారు. నేను ఒకటే చెబుతాను.. ‘బాహుబలి పార్ట్‌ 1’ అప్పుడు ఆ సినిమాను ట్రోల్‌ చేశారు. కానీ అదే రోజు నేను ప్రభాస్‌కు ఫోన్చే‌సి ‘సూపర్‌ హిట్‌’ అన్నాను. ‘లేదు.. భయ్యా..’ అంటూ ఏదో మాట్లాడబోయాడు ప్రభాస్‌. లేదు.. సపర్‌హిట్‌ నువ్వు హ్యాపీగా ఉండు అన్నాను.


బిగ్‌ స్క్రీన్‌ ఫిలింస్‌ టీజర్లను సెల్‌ఫోన్స్‌లో అంచనా వేయలేం. వీఎఫ్‌క్స్‌ సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుుడే ఆ సినిమా ఏంటో అర్థం అవుతుంది. ‘ఆదిపురుష్‌’ కూడా అలాంటి సినిమాయే. టీజర్‌ని నేను ఫోన్లో‌ చూసిన తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్‌ పై చూశాను. ఇప్పుడు 3డీలో చూశాను. టీజర్‌ చూసి విజిల్స్‌ వేశాను. అలాగే రావణ పాత్రధారి పక్షి మీద ఎందుకు వస్తాడు? రాముడు ఇలా ఉంటాడా? అని చర్చలు జరుగుతున్నాయి. రామాయణం ఇతివృత్తాన్ని ఈ తరం ఆడియన్స్‌కు చెప్పేలా చేశారు. ‘ఆది పురుష్‌’ మ్యాజికల్‌ ఫిల్మ్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్‌’ను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఓం రౌత్‌

మరిన్ని వార్తలు