జంతువులకు మాటలొస్తే ప్రశ్నిస్తాయి

23 Mar, 2021 11:43 IST|Sakshi

ప్రభు సాల్మన్‌ 

‘‘పక్షులు, జంతువులు అడవులను అభివృద్ధి చేస్తుంటే మనుషుల మైన మనం ఆ అడవుల్ని నాశనం చేస్తున్నాం.. ప్రకృతిని మనం కాపాడాలి.. లేకుంటే ఆ ప్రకృతి కోపాన్ని తట్టుకోలేం’’ అని దర్శకుడు ప్రభు సాల్మన్‌ అన్నారు. రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్‌  దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’,  హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్‌ ’ పేర్లతో ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రభు సాల్మన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అరణ్య’ కోసం నాలుగేళ్లు కష్టపడ్డాను. ప్రపంచంలో ఏనుగుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవి అంతరించిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఏనుగులు గురించి ఇప్పటి వరకూ ఏనుగులతో షూటింగ్‌ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. జంతువులు మన ఇంట్లోకి వచ్చి, ఈ స్థలం నాది? నువ్వు బయటికి వెళ్లు? అంటే మన పరిస్థితి ఏంటి? జంతువులకు మాటలొస్తే మనల్ని ప్రశ్నిస్తాయి.. ఎందుకంటే అవి నివసించే అడవులను, పచ్చని ప్రకృతిని మనం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి. మా సినిమా చూశాక కొందరిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం ఉంది.

నేను తీసిన ‘కుమ్కి’ సినిమా చూసిన తర్వాత రానా ఫోన్‌ చేసి, ఓ సినిమా చేద్దామన్నారు. ‘అరణ్య’ చేయాలనుకున్నప్పుడు రానా గుర్తొచ్చారు.. తనకి కథ చెప్పగానే ఓకే అన్నారు. ఈ సినిమాని థాయిల్యాండ్, కేరళ, సతార్, మహా భలేశ్వరంలోని అడవుల్లో చిత్రీకరించాం. ఏనుగులతో షూటింగ్‌ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. నాకు డబ్బు కంటే ‘అరణ్య’ లాంటి సినిమా తీయడం సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి. ‘అరణ్య’ విడుదల తర్వాత వాటి గురించి ప్రకటిస్తాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు