బాలీవుడ్‌లో ప్రణీతకు చేదు అనుభవం, తన 2 చిత్రాలు ఓటీటీలోనే!

21 May, 2021 20:33 IST|Sakshi

‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ‘బాపుగారి బొమ్మ’ ప్రణీత సుభాష్‌. ఆ తర్వాత ‘బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస’ వంటి మూవీలో సహానటి పాత్రలు పోషించింది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కన్నడ, తమిళంలోను హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు రావడంతో హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది.

అవి ‘భూజ్‌: ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’, ‘హంగామా 2’. ఈ చిత్రాల్లో ప్రణీత కీలక పాత్రలు పోషించింది. గతేడాది షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తన తొలి హిందీ చిత్రం ‘భూజ్‌’ ఆగష్టు 14, 2020 స్వాంతంత్రయ దినోత్సవం సందర్భంగా థియేటర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో మేకర్స్‌ డీస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించి, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా తను నటించిన రెండవ చిత్రం ‘హంగామా 2’ సైతం ఓటీటీ బాట పట్టేలా కనిపిస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత దృష్ట్యా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ‘హంగామా 2’ మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు కావడంతో బాలీవుడ్‌లో తన సత్తా చాటుకోవాలని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రణితకు కరోనా చేదు అనుభవాన్నే మిగిల్చింది. హిందీలో తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదల కానుండటంతో బాలీవుడ్‌లో ప్రణీతకు నిరాశే ఎదురైందని చెప్పుకోవచ్చు. కాగా భూజ్‌లో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్‌ లీడ్‌ రోల్స్‌ పోషించగా.. శ్రద్దా కపూర్‌, సోనాక్షి సిన్హా, ప్రణీతలు కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తలు