కర్మ వారిద్దరిని శిక్షిస్తుంది: నటుడు

2 Mar, 2021 20:14 IST|Sakshi

ప్రత్యూష బెనర్జీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రత్యూష బెనర్జీ గుర్తుందా.. ‘బాలికా వధు’ సీరియల్‌లో మొదట యుక్త వయసు ఆనంది పాత్రలో నటించింది. ఈ సీరియల్‌ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2016లో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చనిపోయే నాటికే ప్రత్యూష రెండు నెలల గర్భవతి అని తెలిసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌‌ రాహుల్‌ రాజ్ సింగ్‌‌ వల్లనే నటి ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. అతడిపై కేసు కూడా నమోదయ్యింది. మూడు నెలల తర్వాత రాహుల్‌ రాజ్‌కి బాంబే హై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం అతడు నటి సలోని శర్మని వివాహం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియా రాహుల్‌ని ఇంటర్వ్యూ చేసింది. పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ప్రత్యూషని కోల్పోయిన బాధ నుంచి బయటకు వస్తున్నానని.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘‘నా జీవితంలో గతంలో చోటు చేసుకున్న విషాదం, సంతోషకర క్షణాల నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. జీవితాంతం బాధపడుతూ ఉండాలని ఎవరూ భావించారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాను. ప్రస్తుతం నేను జీవితంలో అత్యంత దుర్భర క్షణాలను దాటుకుని వచ్చాను. ఇలాంటి సమయంలో పిల్లలను కనాలనుకోవడం సరైంది కాదని నా అభిప్రాయం. ఇక కుటుంబ సభ్యులు, నా భార్య సలోని ప్రతి ఒక్కరు నన్ను నమ్మారు.. నాకు మద్దతుగా నిలిచారు. నా జీవితంలో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లో వారు నాకు అండగా నిలిచారు’’ అని తెలిపాడు రాహుల్‌ రాజ్‌. 

‘‘ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో కన్నా దారుణంగా తయారైంది. ప్రతి ఒక్కరు నన్ను దోషిలా చూస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. జీవితం చీకటి అయ్యింది. కానీ నేను పోరాడుతున్నాను. సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. పరిస్థితులతో.. సమస్యలతో చాలా గట్టిగా పోరాడుతున్నాను. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, నా భార్య మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అన్నాడు.

కర్మ వారిని శిక్షిస్తుంది
‘‘ప్రత్యూష మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో పాటు కామ్య పంజాబీ, వికాస్‌ గుప్తా నాపై ఆరోపణలు చేశారు. ప్రత్యూష తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి కోపం లేదు. తమ కుమార్తెని కొల్పోయిన బాధలో వారు నన్ను అవమానించారు. దీన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ కామ్య పంజాబీ, వికాస్‌ గుప్తా అలా కాదు. కావాలనే వారు నాపై అబద్దపు ఆరోపణలు చేశారు. ప్రత్యూషపై నేను చేయి చేసుకున్నానని.. అది అందరూ చూస్తుండగా అని చెప్పారు. కానీ ఇది పచ్చి అబద్దం. ఇలా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను వారిని ఏం చేయలేకపోవచ్చు. కానీ కర్మ అంటూ ఒకటి ఉంటుంది.. అది అందర్ని శిక్షిస్తుంది. ఇప్పటికే వికాస్‌ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని’’ తెలిపాడు. 

చదవండి:
గువ్వల్ని మింగుతున్న గద్దలు

నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్‌

మరిన్ని వార్తలు