పారితోషికం కట్‌

4 Oct, 2020 06:30 IST|Sakshi

‘‘కరోనా ప్రభావం నుంచి అందరం కోలుకోవడం ప్రారంభించాం. ఇండస్ట్రీ పనులు మెల్లిగా మొదలయ్యాయి. థియేటర్స్‌ తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్లు నిండుతాయా? ఫారిన్‌ మార్కెట్‌ సంగతి ఏంటి? ఇలా మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు, ప్రశ్నలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొంది యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌. శనివారం ఓ ప్రెస్‌నోట్‌ని కూడా విడుదల చేశారు. పారితోషికం తగ్గించుకునే విషయం ఇందులో ఓ ముఖ్యాంశం. ఆ ప్రెస్‌నోట్‌ వివరాలు.  ‘‘కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఆర్టిస్టులు ఎప్పుడూ మొదటి అడుగు వేస్తూ ఉన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మరియు గిల్డ్‌ కలసి ఆర్టిస్టులు పారితోషికాన్ని (లాక్‌డౌన్‌ ముందు తీసుకుంటున్న లెక్క ప్రకారం) 20 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించాం. రోజుకి ఇరవై వేలు వరకూ తీసుకుంటున్న ఆర్టిస్టులను ఇందులో నుంచి మినహాయించాం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... సినిమాకు 5 లక్షలు వరకు తీసుకుంటున్న వారిని 20 శాతం తగ్గించుకోవడం నుంచి మినహాయించాం. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఎప్పటిలానే పారితోషికాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నిర్ణయం అందరికీ వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు