Priyamani: 'నా భర్త, ప్రియమణిలది అక్రమ వివాహం'

22 Jul, 2021 11:34 IST|Sakshi

Priyamani, Mustafa Raj Marriage: ముస్తఫా రాజ్‌.. నటి ప్రియమణితో పెళ్లయ్యేనాటికి ఇతడికో భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ముస్తఫా 2017లో ప్రముఖ నటి ప్రియమణిని పెళ్లాడాడు. రెండో పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లల కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు.

అయితే తన భర్త పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందు వాపోయింది. దీంతో ఈ ఆరోపణలను ముస్తఫా తోసిపుచ్చాడు. 'నా మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి  నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు?' అని ప్రశ్నించాడు.

మరోవైపు ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని పేర్కొంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇది అక్రమం కిందకే వస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? వీలైతే మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకోవాలని చూస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప మరో దిక్కు లేదు.

కానీ ఇప్పుడతడు తన సమయాన్ని నాకు వ్యతిరేకంగా వాడాలని చూస్తున్నాడు' అని ఆయేషా అభిప్రాయపడింది. మరి ఈ వ్యవహారంపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇదిలా వుంటే ప్రియమణి ఇటీవలే నటించిన 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌, 'నారప్ప' చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్లు సాధించి ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తోన్న ప్రియమణి దక్షిణాదిన టాలెంటెడ్‌ నటిగా గుర్తింపు సంపాదించింది.

మరిన్ని వార్తలు