ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్‌.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవ ఎన్నిక

17 Aug, 2021 19:52 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన సహచర నటి దీపిక పదుకుణే స్థానాన్ని దక్కించుకుంది. జియో ‘ముంబై అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్‌’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్న దీపికా స్థానా​న్ని ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. నాలుగు నెలల క్రితమే ఈ పదవి నుంచి దీపికా వైదొలిగింది. ఈ సందర్భంగా ముంబై అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్‌ సంస్ధ వచ్చే సంవత్సరానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.

‘మామి’ బోర్డు సభ్యులు కో చైర్‌ పర్సన్‌ నీతా ముఖేశ్‌ అంబానీ, ఫిల్మ్‌ డైరక్టర్‌ అనుపమ చోప్రా, అజయ్‌ బిజ్లీ, ఆనంద్‌ జీ మహీంద్రా, ఫర్హన్‌ అక్తర్‌, ఇషా అంబానీ, కబీర్‌ ఖాన్‌, కౌస్తుభ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్‌ దేశ్‌ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ ఏకగ్రీవంగా ప్రియంకా చోప్రాను ‘మామి’  చైర్‌ పర్సన్‌గా ఎన్నుకున్నారు.

మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని తెలిపింది. మామిలోని సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఫిల్మ్‌ఫెస్టివల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది.

చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన ప్రియంకా చోప్రాను మామి బోర్డ్‌ ట్రస్టీ ఇషా అంబానీ స్వాగతించింది. ప్రియాంక తన సారథ్యంలో మామి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 22వ ‘మామి’ ముంబై ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఎడిషన్‌ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జియో మామి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021 అక్టోబర్‌ నుంచి 2022 మార్చి వరకు జరగనుంది.

మరిన్ని వార్తలు