తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై స్పందించిన అల్లు అరవింద్‌

19 Nov, 2022 13:12 IST|Sakshi

తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ విడుదల ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి విడుదలకు డైరెక్ట్‌ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే వారసుడు మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటిచింది. తమిళ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన వారసుడు మూవీ డబ్బింగ్‌ చిత్రం కావడంతో ఈ సినిమా సంక్రాంతి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై తాజాగా తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్‌ దర్శక-నిర్మాతలు

తెలుగు చిత్రాలు తమిళ్‌లో ఏ ఆటంకం లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని తమిళ దర్శక-నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే తాము కూడా తెలుగు చిత్రాలను ఇక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ విషయమై ఈ నెల 22 తమిళ నిర్మాతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాతల అభ్యంతరంపై తాజాగా ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. డబ్బింగ్‌ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదని అన్నారు. సినిమాకు ఎల్లలు లేవని, ఎల్లలు తీసేశామన్నారు. సౌత్‌ నార్త్‌ అనే భేదాలు లేవని, బాగున్న సినిమా ఎక్కడైన ఆడుతుందని అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు