RJ Balaji: రన్‌ బేబీ రన్‌ హిట్‌.. హీరోకు బంగారు ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

9 Feb, 2023 09:12 IST|Sakshi

కార్తీ హీరోగా సర్ధార్, శశికుమార్‌ హీరోగా కారి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రిన్స్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మించిన తాజా చిత్రం రన్‌ బేబీ రన్‌. ఆర్‌జే బాలాజీ కథానాయకుడిగా నటించిన ఇందులో ఐశ్వర్యరాజేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు. కృష్ణకుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బుధవారం చెన్నైలోని ఓ హోటల్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది.

ఈ  సందర్భంగా నిర్మాత లక్ష్మణన్‌ మాట్లాడుతూ.. చిత్ర కథలోకి ఎప్పుడైతే ఆర్‌జే.బాలాజీ వచ్చారో అప్పుడే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వచ్చాయని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు చెప్పారు. నటీనటులందరూ ఎంతగానో సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తమ సంస్థలో ఆర్‌జే.బాలాజీ హీరోగా మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు.

నటుడు ఆర్‌జే.బాలాజీ మాట్లాడుతూ.. చిత్రానికి మౌత్‌ టాక్‌ చాలా ముఖ్యం అన్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచి అది ఉందన్నారు. అయితే మంచి కంటెంట్‌ లేకపోతే ఎంత ప్రచారం చేసినా నిరుపయోగమని తెలిపారు. రన్‌ బేబీ రన్‌ చిత్రంలో మంచి కంటెంట్‌ ఉందని అన్నారు. పొంగల్‌ సందర్భంగా పెద్ద హీరోల చిత్రాలు విడుదలై తమ చిత్రానికి ఎక్కువ థియేటర్లు లభించలేదని, అయితే రెండో వారం థియేటర్లు అధికం అయ్యాయని తెలిపారు. ఇప్పుడు మల్టీ థియేటర్లలోనే రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శితమవుతున్నాయని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్‌ కావడంతో నిర్మాత ఐసరి గణేశ్‌ అభినందిస్తూ బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారన్నారు. మరి రన్‌ బేబీ రన్‌ చిత్ర నిర్మాత మిలాన్‌ జలీల్‌ ఏం కానుక ఇచ్చారన్న ప్రశ్నకు ఆ నిర్మాత తనతో మరో చిత్రం చేస్తాననడమే పెద్ద కానుక అన్నారు.

చదవండి: డైరెక్టర్‌తో గొడవలు.. లియో నుంచి తప్పుకున్న త్రిష

మరిన్ని వార్తలు