Neha Shetty: హీరోయిన్‌ పుట్టుమచ్చల గురించి ఆరా, ప్రతాపం చూపించిన నేహా శెట్టి

3 Feb, 2022 09:18 IST|Sakshi

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం డిజె టిల్లు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌ హీరో సిద్ధును అనుచిత ప్రశ్న అడగడంతో అందరూ ఇబ్బందిగా ఫీలయ్యారు. హీరోయిన్‌ అయితే సోషల్‌ మీడియాలో అతడిని తీవ్రంగా ఎండగట్టింది. కాగా డిజె టిల్లు ట్రైలర్‌లో హీరో.. హీరోయిన్‌ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది.

ఈ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్‌.. 'ట్రైలర్‌లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. కానీ ఆ మాటలకు నేహాశెట్టి ఫీలైంది. అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారని బాధపడింది. 'ఈ రోజు జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ ప్రశ్న ఎదురవడం చాలా దురదృష్టకరం.. దీన్ని బట్టి అతడు అతడు తన చుట్టూ ఉండే మహిళలను ఎంత గౌరవిస్తున్నాడో తెలుస్తోంది' అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది.

దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ హీరోయిన్‌కు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పాడు. కానీ ఈ నిర్మాత కూడా స్టేజీపై నోరు అదుపులో పెట్టుకోలేకపోయాడు. 'డిజె టిల్లు నాగవంశీ బయోగ్రఫీనా?' అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు.. 'ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనమూ యాక్ట్‌ చేస్తాం.. తప్పేం ఉంది' అని కొంటెగా ఆన్సరిచ్చాడు.

మరిన్ని వార్తలు