డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..

19 Mar, 2023 06:13 IST|Sakshi

– నిర్మాత రాజేష్‌ దండా

‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్‌ దండా. సందీప్‌ కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్‌ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్‌ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్‌ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను.

‘కేరాఫ్‌ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘టైగర్‌’ సినిమా నుంచి సందీప్‌ కిషన్, వీఐ ఆనంద్‌లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్‌ బ్యానర్‌ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్‌ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్‌లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్‌ తేజ్‌తో విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్‌ ఉంది’’ అన్నారు.

>
మరిన్ని వార్తలు