Producer Sudhkar Reddy: టికెట్‌ ధరలు పెంచడం అర్థం లేనిది

10 Jun, 2022 08:27 IST|Sakshi

తెలుగు సినీరంగంలో పంపిణీదారుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు శ్రేష్ట్‌ మూవీస్‌ అధినేత, హీరో నితిన్‌ తండ్రి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి. కమల్‌హాసన్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్‌’ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేసి పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  విలేకరులతో ముచ్చటించారు. ఈ మేరకు సధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘విక్రమ్‌’ సినిమాకి 20 శాతం రిస్క్‌ ఉంటుందనిపించినా విడుదల హక్కులు తీసుకున్నామని, సినిమా రిలీజ్‌ తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నామనిపించిందన్నారు.

‘విక్రమ్‌ మూవీకి మంచి ఫలితమే దక్కింది. ఇప్పటివరకు తెలుగులో 80 కోట్ల గ్రాస్‌ వచ్చింంది. వసూళ్లతో కమల్‌గారు, నేను, ఎగ్జిబిటర్లు.. ఇలా అందరూ హ్యాపీ’ అని నిర్మాత సుధాకర్‌ రెడ్డి అన్నారు.  ‘‘నేను ‘విక్రమ్‌’ ప్రివ్యూ చూడలేదు. లోకేశ్‌పై నమ్మకంతో, కమల్‌గారు, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య ఉన్నారని సినిమా తీసుకున్నాం. ‘విక్రమ్‌’ ట్రైలర్‌ చూశాక మా అబ్బాయి (హీరో నితిన్‌) కూడా తీసుకోమన్నాడు. సినిమా అనేది ఓటీటీలో చిన్న స్క్రీన్‌లో చూస్తే అంత ఎఫెక్ట్‌ ఉండదు.. థియేటర్‌ అనుభవం వేరు. పెద్ద సినిమాలు రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని రూల్‌ పెట్టుకుంటే పరిశ్రమకు మంచిది’’ అన్నారు.  

టికెట్‌ ధరలు పెంచడం అర్థం లేనిది 
‘‘ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. 200 నుండి 350 పెట్టుకోమన్నారు. అలగాని 350పెట్టకూడదు కదా. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము మల్టీ ఫ్లెక్స్ లో 200 మాత్రమే పెట్టాం. డబ్బు వచ్చింది కదా.  టికెట్‌ ధరలు పెంచక ముందే  ‘బాహుబలి 2’ నైజాంలో 55 కోట్లు వసూలు చేసింది. మరి.. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదు. పెరిగిన ధరల వల్ల రిపీట్‌ ఆడియన్స్, ఫ్యామిలీస్‌ థియేటర్స్‌కి రాకపోవడంతో నష్టం తప్పడంలేదు.  ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్‌ సిటీల్లో వారాంతంలో రూ. 1000 నుంచి 1500 వరకు రేట్లు పెడతారు. మిగిలిన రోజుల్లో మామూలే. చెన్నైలో టికెట్‌ ధరలు మనకంటే తక్కువగానే ఉన్నాయి’’ అన్నారు సుధాకర్‌ రెడ్డి.    

ఇక విక్రమ్‌ సీక్వెల్‌పై స్పందిస్తూ.. ఈ మూవీకి సీక్వెల్‌ ఉందని స్పష్టం చేశారు. కానీ సీక్వెల్‌ఇంకా స్టార్ట్ కాలేదని, దర్శకుడు ఫ్రీ కావాలి కదన్నారు. సీక్వెల్ చేసినప్పుడు మనకే ఇస్తారని, మనమే చేస్తామని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం వారి బ్యానర్లో వస్తున్న మాచర్ల నియోజికవర్గం 80శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే వక్కంత వంశీ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఒక పాట షూట్ చేశామన్నారు. ఇది కిక్, రేసు గుర్రం తరహలో ఉంటుందని, సురేందర్ రెడ్డితో సినిమా కూడా ఉందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు