పుష్పరాజ్‌ డబుల్‌ బొనాంజ!

13 May, 2021 00:31 IST|Sakshi

‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం ఖరారైపోయింది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. వై. రవిశంకర్, నవీన్‌ ఎర్నేని, ముత్తం శెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ ఇటీవల బలంగా వినిపించింది.

ఈ విషయం గురించి వై. రవిశంకర్‌ మాట్లాడుతూ – ‘‘పుష్ప’ కథను రెండున్నర గంటల్లో చెప్పడం చాలా కష్టం. అల్లు అర్జున్, సుకుమార్, మేం చర్చించుకుని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. సెకండ్‌ పార్టులో పది శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అన్నారు. రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్న నేపథ్యంలో ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ను జోడించే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ పాటలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నర్తిస్తారని లేటెస్ట్‌ టాక్‌.

అల్లు అర్జున్‌కు నెగటివ్‌... ఇటీవల కరోనా బారిన పడిన అల్లు అర్జున్‌ కోలుకున్నారు. ‘‘పదిహేను రోజుల క్వారంటైన్‌ తర్వాత కరోనా పరీక్షల్లో నాకు నెగటివ్‌ నిర్ధారణ అయింది. నేను కోలుకోవాలని ఆశించిన అందరికీ ధన్యవాదాలు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నాను. దయచేసి అందరూ  జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు అల్లు అర్జున్‌. అలాగే తన పిల్లలు (అల్లు అయాన్, అర్హా)లతో కొన్ని రోజుల తర్వాత గడిపిన  ఆనంద క్షణాల వీడియోను అల్లు అర్జున్‌ షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు