Punch Prasad: కిడ్నీలు పాడయ్యాయి, నా వల్ల కాదని చచ్చిపోదామనుకున్నా

19 Nov, 2022 18:51 IST|Sakshi

నవ్వించడం అందరికీ చేతకాదు.. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. చిన్న నవ్వు.. కష్టాలను, ఒత్తిడిని మర్చిపోయేలా చేసి స్వాంతన చేకూర్చుతుంది. కానీ అలా నవ్వించేవారి జీవితాల్లో ఎంతో విషాదం ఉంటుంది. అయినా దాన్ని పెదాల చాటునే బిగబట్టుకుని ఆపేస్తారు. వారి కష్టాలను కూడా కామెడీ చేసి నవ్విస్తారు. కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ ఆ కోవలోకే వస్తాడు. ఓపక్క తనకున్న వ్యాధితో పోరాడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు. తాజాగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. కనీసం తనంతట తానుగా నాడవలేకపోతున్నాడు. ఇంతకీ పంచ్‌ ప్రసాద్‌కు వచ్చిన వ్యాధి ఏంటి? ఎంతకాలం నుంచి దానితో పోరాడుతున్నాడనే విషయాలను ఈ కమెడియన్‌ కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అందులో ఆయన ఏమన్నాడంటే.. 'మాది లవ్‌ మ్యారేజ్‌. నా ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత కిడ్నీ సమస్య బయటపడింది. నాతో సహా మా ఇంట్లో వాళ్లు కూడా ఈ పెళ్లి వద్దని అమ్మాయికి నచ్చజెప్పాం. కానీ ఒక్కరోజు నాతో ఉన్నా చాలని చెప్పి అందరినీ ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మేము మణికొండలో అవినాష్‌ వాళ్ల ఇంటిపై పోర్షన్‌లో ఉండేవాళ్లం. ఓసారి పైన ఉన్నప్పుడు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడు నా భార్య గర్భవతి. ఆమెకు చెప్తే కంగారు పడుతుందని కిందకు వచ్చి కూర్చున్నా. నా ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడే అటుగా వచ్చిన గెటప్‌ శ్రీను నా భార్యను పిలిచి రూ.50 వేలిచ్చి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయించాడు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయేది.

ఒకానొక సమయంలో ఈ ఖర్చులు, నొప్పి భరించడం నావల్ల కాదని చనిపోదామనుకున్నా. కానీ నాకు కిడ్నీ ఇవ్వడానికి కూడా నా భార్య సిద్ధమైంది. ఇప్పటికీ నా ఆరోగ్యం గురించి పూర్తిగా ఆవిడే చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. పంచ్‌ ప్రసాద్‌కు కిడ్నీలు పాడయ్యాయని తెలిసినా పెళ్లి చేసుకుని అతడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంటే ఆ ఇల్లాలు నిజంగా గ్రేట్‌ అంటున్నారు నెటిజన్లు.

చదవండి: నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌
పబ్లిక్‌గా అసభ్యంగా తాకాడు, అప్పుడు ఏం చేశానంటే: సుష్మితా సేన్‌

మరిన్ని వార్తలు