'పుష్ప' మూవీ టీం ఈరోజు తిరుమల తిరుపతి శ్రీవారిని సందర్శించింది. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనంలో పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్, తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
'పుష్ప' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీవారి సన్నిధికి వచ్చామని సినిమా యూనిట్ పేర్కొంది. ఈ సినిమా పార్ట్-2 నిర్మాణాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు. కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత రాత్రి తిరుపతిలో ఈ సినిమా సక్సెస్ పార్టీని నిర్వహించారు.