Pushpaka Vimanam Trailer: భార్య లేచిపోయింది.. ఆనంద్ దేవ‌ర‌కొండ‌

30 Oct, 2021 19:43 IST|Sakshi

దొర‌సాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల‌తో న‌టుడిగా నిరూపించుకున్నాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. తాజాగా పుష్ప‌క విమానం సినిమాతో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడీ హీరో. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైల‌ర్‌లో ఆనంద్‌ను ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడిగా చూపించారు. అత‌డికి ఓ అంద‌మైన అమ్మాయితో పెళ్లి జ‌రిపించారు. పెళ్లైన 8 రోజుల‌కే సిటీలో కొత్త జీవితం ప్రారంభించిందీ జంట‌.

అయితే అత‌డు త‌న భార్య‌ను ఎవ‌రికీ చూపించ‌క‌పోగా ఆమె ఇంట్లోనే ఉన్న‌ట్లు న‌మ్మిస్తాడు. త‌నే ఇంటి ముందు ముగ్గులేస్తూ హోట‌ల్ నుంచి ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకొని త‌న భార్యే చేసింద‌ని స్కూల్‌లో స్టాఫ్‌కు వ‌డ్డిస్తాడు. ఆనంద్ త‌న భార్య‌ను ఎవ‌రికీ చూపించక‌పోవ‌డానికి కార‌ణం ఆమె పెళ్లైన‌ ప‌ది రోజుల‌కే లేచిపోతుంది. ఈ విష‌యంలో పోలీసులు అత‌డినే అనుమానిస్తారు. నీ భార్య లేచిపోయింద‌ని చెప్ప‌డానికి ఒక్క సాక్ష్యం చూపించు అని పోలీస్ పాత్ర‌లో ఉన్న సునీల్ ఆనంద్‌ను అడుగుతాడు. దీనికి హీరో ఆమె రాసిన లెట‌ర్ ఉందంటూనే దాన్ని మింగేసాన‌ని చెప్తాడు.

అలా వినూత్న కాన్సెప్ట్‌తో వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. న‌వంబ‌ర్ 12న ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ‌బోతోంది. ఇదిలా వుంటే అత‌డు ‘మధురా’ శ్రీధర్‌ రెడ్డి, బలరామ్‌ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్‌ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్‌ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది.

మరిన్ని వార్తలు