ప్రభాస్‌ సినిమాలో మెరవనున్న రాశీఖన్నా!

11 Jun, 2021 02:20 IST|Sakshi
రాశీ ఖన్నా

డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై మరింత ఫోకస్‌ పెట్టినట్లున్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌’ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతితో పాటు ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు రాశీ ఖన్నా. తాజాగా అజయ్‌ దేవగణ్‌ నటించనున్న ‘రుద్ర’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) వెబ్‌ సిరీస్‌లో ఓ మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేసేందుకు ఈ బ్యూటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ‘వెంటిలేటర్‌’ ఫేమ్‌ ఎమ్‌. రాజేష్‌ ‘రుద్ర’ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు.

ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా ఈ హిందీ వెబ్‌ సిరీస్‌ రూపొందనుంది. ‘లూథర్‌’ సిరీస్‌లో రూథ్‌  విల్సన్‌ పోషించిన పాత్రలో రాశీ కనిపిస్తారట. ‘రుద్ర’ షూటింగ్‌ ఈ నెల 21న ప్రారంభం అవుతుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రాశీ ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేసే చాన్స్‌ దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో మూడు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. ఇలా కెరీర్‌లో టాప్‌ గేర్‌తో దూసుకెళ్తున్నారు రాశీ ఖన్నా.
 

మరిన్ని వార్తలు