అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి

1 Dec, 2020 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించారు. తెలుగుదనం ఉట్టిపడేలా ముద్ద మొహంతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాశి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో ‘వెంకి’ లాంటి సినిమాలో ఐటెం సాంగ్స్‌‌ చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాశికి మళ్లీ సినిమా ఆఫర్లు వస్తుండటంతో నటిగా తన సెకండ్‌ ఇన్నింగ్‌ను ప్రారంబించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్రకోసం మొదట తననే సంప్రదించినట్లు వెల్లడించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పాత్రను పోషించిన అనసూయ భరద్వాజ్‌కు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. అయితే రంగమ్మత్త కోసం మొదట ‘రంగస్థలం’ యూనిట్‌ రాశిని సంప్రదించారంట. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో తిరస్కరించానని రాశి చెప్పారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?)

దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘రంగస్థలం సూపర్‌ హిట్‌ సాధించింది. ఇందులోని రంగమ్మత్త క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు నాకు ఈ పాత్ర గురించి వివరించినప్పుడు నాకు కూడా రంగమ్మత్త నచ్చింది. కానీ ఇందులో ఆమె మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాలి. ఆ లుక్‌ నాకు నప్పదని భావించి రంగమ్మత్త పాత్రను తిరస్కరించాను’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే మహేశ్‌ బాబు ‘నిజం’ సినిమాలో రాశి నెగిటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ... ఇందులో నెగిటివ్‌ రోల్‌ చేసి తప్పు చేశానన్నారు.  ఇందులో గోపీచంద్‌కు తను లవర్‌గా నటించాలని దర్శకుడు తేజ కథ వివరించారని చెప్పారు. అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని, దీంతో సినిమా నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్‌గా సినిమా మధ్యలో ఇలా చేస్తే ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం అవుతుందని ఆయన చెప్పారు. అందుకే ‘నిజం’లో నటించానని రాశి చెప్పుకొచ్చారు. (చదవండి: లుక్‌ బాగుందంటే ఆనందంగా ఉంది)

>
మరిన్ని వార్తలు