‘రాధే’ పైరసీ: ముగ్గురు సోషల్‌ మీడియా యూజర్లపై కేసు

19 May, 2021 18:06 IST|Sakshi

గతవారం ఓటీటీలో విడుదలైన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ చిత్రం ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీప్లెక్స్‌లో పే పర్‌ వ్యూ విధానంలో విడుదలైంది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిది. దీనిపై కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందిస్తూ పైరసీ కారులపై మండిపడ్డాడు.

మూవీ పైరసీకి పాల్పడిన వారిపై సైబర్‌ సెల్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించాడు. అంతేగాక జీ5 సంస్థ సైతం దీనిపై సెంట్రల్‌ సైబర్‌ సెల్‌కి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.. ఇదిలా ఉండగా ఈ మూవీ పైరసీ కేసులో గుర్తుతెలియని ముగ్గురు సోషల్‌ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు తాజాగా సైబర్‌ సెల్‌ పోలీసులు వెల్లండించారు. వీరిలో ఇద్దరు వాట్సాప్‌ యూజర్లు, ఒక ఫేస్‌బుక్‌ ఖాతా దారుడు ఉన్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుని ఫేస్‌బుక్‌లో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ద్వారా విక్రయించేందుకు అతడు ఆఫర్‌ చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాధే చిత్రం పైరసీ వెర్షన్‌ వివిధ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంపై లీకైన వెంటనే జీ5 నిర్మాత తమ సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌, కాపీరైట్‌ యాక్ట్‌ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఇద్దరు వాట్సప్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్లు, ఫేస్‌బుక్‌ ఖాతా దారులను గుర్తించామన్నారు. ప్రస్తుతం తమ టీం మరి కొందరి ఫోన్‌ నెంబర్లను ట్రాక్‌ చేసే పనిలో  నిమగ్నమైందని తెలిపారు.  

చదవండి: 
‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్‌, సల్మాన్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు