'బాహుబలి కంటే ముందే రాధేశ్యామ్‌ మొదలుపెట్టాం'

26 Feb, 2022 23:29 IST|Sakshi

‘‘రాధేశ్యామ్‌’ చిత్రకథను ప్రభాస్‌గారిని దృష్టిలో పెట్టుకునే రాశాను. రెండున్నర గంటలు ఈ కథ విన్న ఆయన చాలా ఎగై్జట్‌ అయ్యి, సినిమా చేద్దామన్నారు. సెట్‌లో ఆయన చిన్నపిల్లాడిలా ఉంటారు.. ప్రతిదీ నేర్చుకుంటారు. ప్రభాస్‌ లాంటి మంచి ఫ్రెండ్‌తో పాన్‌ ఇండియా సినిమా చేయడం నా అదృష్టం’’ అని రాధాకృష్ణ కుమార్‌ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. కృష్ణంరాజు సమర్పణలో రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ కుమార్‌ చెప్పిన విశేషాలు.

∙జ్యోతిష్య శాస్త్రంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. జ్యోతిష్యం నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ కథ అనుకున్నాక చాలా అధ్యయనాలు చేశాను.. కొందరు జ్యోతిష్కులను కలిసి, వారి అనుభవాలు తెలుసుకున్నాను. జ్యోతిష్యం అంటే నమ్మకమా? నిజమా? అనేదానికి నేను ఇచ్చిన ముగింపు ఏంటో మా సినిమా చూస్తే తెలుస్తుంది. యూనివర్సల్‌ పాయింట్‌తో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులకూ కనెక్ట్‌ అవుతుంది. ∙నా దర్శకత్వంలో వచ్చిన ‘జిల్‌’ (2015) తర్వాత ‘రాధేశ్యామ్‌’ అనుకున్నాను.

నిజానికి ‘బాహుబలి’ చిత్రం కంటే ముందే ‘రాధేశ్యామ్‌’ కథని మొదలుపెట్టాం. ‘బాహుబలి’ విడుదల తర్వాత కథలో ఎలాంటి మార్పులూ చేయలేదు.. ఎందుకంటే ‘బాహుబలి’ సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతో ‘రాధేశ్యామ్‌’ని కూడా పెద్ద సినిమాగా అనుకున్నాం. ‘సాహో’ టైమ్‌లోనే ‘రాధేశ్యామ్‌’ కూడా కొంత షూటింగ్‌ జరిగింది. కానీ కోవిడ్‌ వల్ల కొంత ఆలస్యం అయింది. ∙గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం నిజంగా నా అదృష్టం. ఈ కథను మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్‌ను బేస్‌ చేసుకుని చేద్దామనుకున్నాను. కానీ ప్రభాస్‌ సూచన మేరకు యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌గా మారింది.

ఇటలీ, ఆస్ట్రేలియా, జార్జియాలో షూటింగ్‌ చేశాం. కోవిడ్‌ వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతోందనే చిన్న టెన్షన్‌ తప్ప నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఫుల్‌ క్లారిటీతో సినిమా తీశాను. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఒత్తిడి లేకుండా పనిచేశా. లాక్‌డౌన్‌ వల్ల యూరప్‌ షెడ్యూల్‌ను మధ్యలోనే ఆపేసి వేరే దేశాల మీదుగా ఇళ్లకు చేరుకున్నాం. క్లైమాక్స్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో చేశాం. ∙ఈ చిత్రంలో కృష్ణంరాజుగారు ప్రత్యేక పాత్ర చేశారు. ఆ పాత్రకు ఆయనే కరెక్ట్‌ అని ప్రభాస్‌ గారే చెప్పారు. రెండు తరాల హీరోలతో ఒకేసారి పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. పూజా హెగ్డే కథ వినగానే ఓకే అన్నారు. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆమెది.

ప్రభాస్, పూజా హెగ్డేల జంట చూడముచ్చటగా ఉంటుంది. ‘రాధేశ్యామ్‌’ కథ నచ్చడం, పైగా ప్రభాస్‌గారిలాంటి సినిమాతో రీ ఎంట్రీ అంటే బాగుంటుందని భాగ్యశ్రీగారు చేశారు. ∙‘రాధేశ్యామ్‌’కి బలమైన కథ కుదిరింది.. అందుకే తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం, తమన్‌ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి భారీ సినిమాలకు గ్రాఫిక్స్‌ ప్రాణం. కమల్‌ కణ్ణన్‌గారు దాదాపు 12 దేశాల్లోని టెక్నీషియన్స్‌ను కో ఆర్డినేట్‌ చేసుకుని విజువల్‌ ఫీస్ట్‌గా ఉండేలా శ్రమించారు. 

∙సోషల్‌ మీడియా వల్ల సినిమా అనేది ఇంటర్నేషనల్‌ అవుతోంది. నాకు ఫలానా జోనర్‌లో సినిమా తీయాలనే ఆసక్తి లేదు.. అన్ని జోనర్స్‌ ఇష్టం. అయితే చాలెంజింగ్‌ కథలంటే ఇంకా ఇష్టం. ప్రస్తుతానికి కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. కొందరు నిర్మాతలు సంప్రదించారు. కానీ ఏ సినిమానీ ఓకే చేయలేదు. ‘రాధేశ్యామ్‌’ విడుదల తర్వాత వివరాలు చెబుతాను.  

మరిన్ని వార్తలు