Rahul Ramakrishna: రైలు ముందు విన్యాసం.. వీడియో షేర్‌ చేసిన రాహుల్‌.. నెటిజన్స్‌ ఫైర్‌!

3 Jun, 2023 16:05 IST|Sakshi

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై యావత్‌ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి ఒకే చోట ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురవడంతో 260కి పైగా మంది మృత్యువాత పడగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా భయానక రైలు ప్రమాదం దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ అనుచిత ట్వీట్‌ చేశాడు.

కమెడియన్‌పై మండిపాటు
సైలెంట్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటుడు బస్టర్‌ కీటన్‌ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వందల కుటుంబాలు ట్రైన్‌ యాక్సిడెంట్‌లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్‌ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్‌ సదరు ట్వీట్‌ డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పాడు.

సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు
'ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను. ఒట్టేసి చెప్తున్నా.. ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్‌ రాసుకునే పనిలో ఉన్నాను.. ఏ వార్తలూ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. మరోసారి క్షమాపణలు చెప్తున్నా' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ 'మీ నిజాయితీని మెచ్చుకుంటున్నా. మిమ్మల్ని ట్రోల్‌ చేయాలనుకోలేదు. కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్‌ రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్‌ ఫాలో అవడం లేదు. కేవలం నా పనిపైనే ఫోకస్‌ చేశాను. నన్ను అలర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌' అని పేర్కొన్నాడు.

చదవండి: విషమంగా పంచ్‌ ప్రసాదం ఆరోగ్యం
ఒడిశా రైలు ప్రమాదం: ఈ పాపం ఎవరిది?

మరిన్ని వార్తలు