కరోనా కష్టాలు చెప్పి బాధపడిన హీరోయిన్

28 Jan, 2021 08:54 IST|Sakshi

కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. కరోనా బారిన పడి తాను నరకయాతన పడ్డాడని రత్తాలు రత్తాలు అంటూ చిరంజీవితో ఆడిపాడిన ‌లక్ష్మి రాయ్ బాధపడింది. 2020 తన జీవితంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంవత్సరమే తన తండ్రిని కోల్పోయానని కన్నీరు పెట్టుకుంది. ఈ బాధాకర విషయాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తాను కరోనా బారినపడ్డట్లు చెప్పుకుంది.

2020 నవంబర్‌లో నోటి క్యాన్సర్‌తో తన తండ్రి రామ్‌ రాయ్‌ను కోల్పోయానని బాధపడింది. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని తెలిపింది. మానసికంగా కుంగిపోయిన సమయంలో కొత్త సంవత్సర సంబరాలకు దుబాయ్‌కు వెళ్లగా అక్కడ కరోనా బారిన పడ్డట్లు లక్ష్మీ రాయ్‌ పేర్కొంది. అప్పుడు ఎదుర్కొన్న కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని వివరించింది. దుబాయ్‌లో న్యూ ఇయర్‌ సంబరాల కోసం వెళ్లిన సమయంలో గొంతునొప్పి రావడం.. ఆ తర్వాత వాసన గ్రహించకపోవడం గుర్తించి పరీక్షించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. దుబాయ్‌లో తనకు ఎవరూ తెలిసిన వారు లేరని, ఒక గదిలో ఒక్కదాన్నే ఐసోలేషన్‌లో ఉన్నట్టు వివరించింది. అనంతరం 12 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నానని.. అయితే కరోనాతో తాను మానసికంగా మరింత కుంగిపోయినట్లు ఆంగ్ల మీడియాతో లక్ష్మి రాయ్‌ పంచుకుంది. 

ఈ విధంగా 2020 సంవత్సరం తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ లక్ష్మి రాయ్‌ బాధపడింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ముంబై వచ్చేసింది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ్‌ సినిమాలతో పలు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నట్లు చెప్పింది. గతంలో చిరంజీవి సరసన ఖైదీ నంబర్‌ 150లో ఐటమ్‌సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు