మళ్లీ ‘అన్నాత్త’ బిజీ! 

9 Apr, 2021 06:48 IST|Sakshi
రజనీకాంత్‌ అభివాదం 

సాక్షి, చెన్నై: తలైవా రజనీకాంత్‌ అన్నాత్త షూటింగ్‌లో బిజీ కానున్నారు. ఇందుకోసం చెన్నై నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు గురువారం బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత ఏడాది ఓ వైపు పార్టీ కసరత్తులు సాగుతున్న నేపథ్యంలో మరో వైపు అన్నాత్త షూటింగ్‌ను ముగించుకునేందుకు రజనీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్‌, మీనా, కుష్బూ తారాగణం నటిస్తున్నారు.

ఈ షూటింగ్‌ యూనిట్‌లోని పలువురు కరోనా బారినపడడం, ఆ తర్వాత పరిణామాలతో రజనీ కాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం జరిగాయి. ఈ కారణాలతో రాజకీయపార్టీ ప్రకటనను సైతం తలైవా విరమించుకోక తప్పలేదు. ఆయన వెన్నంటి ఉన్న అభిమానం తలా ఓ పార్టీలో సర్దుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పయనం సాగించాయి. రెండు మూడు నెలలు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన రజనీకాంత్‌ తాజాగా మళ్లీ అన్నాత్తపై దృష్టి పెట్టారు.

ఇప్పటికే 75 శాతం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ముగిసినట్టు, మిగిలిన షెడ్యూల్‌ను ముగించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం చెన్నై నుంచి అన్నాత్త హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. గురువారం  ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అన్నాత్త షూటింగ్‌ స్పాట్‌లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయడం, తన ఆరోగ్యానికి జాగ్రత్తల్ని పాటించే రీతిలో తలైవా ముందు జాగ్రత్తలతో హైదరాబాద్‌ వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు