పునీత్‌ రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు

31 Oct, 2022 12:58 IST|Sakshi

తమిళసినిమా: దిగ్గజ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కుమారుడు, యువ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ గత ఏడాది గుండెపోటుతో హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. ఆయన చివరిగా నటించిన జేమ్స్‌ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా కందాడ కుడి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని పునీత్‌ రాజ్‌కుమార్‌ రూపొందించారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కాకుండానే ఆయన మరణించడంతో ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌ మిగిలిన భాగాన్ని విడుదల చేశారు.

ఇది పునీత్‌ రాజ్‌కుమార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనిని ఆయన తొలి వర్ధంతి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నారు. కాగా పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత అవార్డు కన్నడ రత్నను ప్రదానం చేయనుంది. ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా నవంబర్‌ 1న బెంగుళూరులో భారీఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది.

ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నటుడు రజనీకాంత్‌కు, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జూనియర్‌ ఎన్‌టీఆర్‌కు ఆహ్వానం అందింది. వీరిద్దరూ ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు. దీనిపై నటుడు రజనీకాంత్‌ శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు నవంబర్‌ 1న మధ్యాహ్నం చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకోనున్నట్లు అందులో పేర్కొన్నారు. పునీత్‌ గొప్ప నటుడని కొనియాడారు.

మరిన్ని వార్తలు