Rajinikanth: రజనీ మక్కల్ మండ్రం రద్దు.. ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగింపు

12 Jul, 2021 11:46 IST|Sakshi

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో తిరిగి సమావేశం అవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ స్పందించాడు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు రాజకీయ పార్టీగా చెప్తున్న రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. 

ఈ మేరకు సోమవారం అభిమానులతో సమావేశమైన తలైవా.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు రజనీ మక్కల్‌ మండ్రంను ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ఇక అనారోగ్యం రీత్యా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. తాజాగా మరోసారి చర్చల నేపథ్యంలో ఊహాగానాలు రావడంతో ఇలా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

 

ఇదిలా ఉంటే ‘అన్నాతే’ సినిమాలో నటిస్తున్న రజనీ.. అరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ మధ్యే అమెరికాకు వెళ్లి వచ్చాడు. కరోనా, తమిళనాడు ఎన్నికలు, అమెరికా చెకప్‌ నేపథ్యంలో అభిమానులకు ఇంతకాలం దూరంగా ఉన్నానని, ఈ నేపథ్యంలోనే సమావేశం అయ్యానని ఆయన సమావేశం ముందు మీడియాకు స్పష్టం చేశాడు. అయితే రాజకీయ భవిష్యత్త్‌ పైనా ఈ చర్చల తర్వాత స్పష్టం చేస్తానని చెప్పిన రజినీ.. ఊహాగానాలకు తెరదించుతూ ఇక రాజకీయాలు లేనట్లేనని స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు