రాజకీయ రంగ ప్రవేశంపై సుమారు రెండు దశాబ్దాల పాటు ఊరిస్తూ వచ్చిన తలైవా ఇ టీవల వయసు, ఆరోగ్య సమస్యలు కారణంగా రా జకీయాల్లోకి వచ్చేదేలేదని కుండబద్ధలు కొట్టారు. అయితే సినిమా విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు మన సూపర్స్టార్. నటుడుగా 50 వసంతాలకు దగ్గరలో ఉన్న ఈయన ప్రస్తుతం 1955వ చిత్రం జైలర్లో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న జైలర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. అలాగే సూపర్స్టార్ మరో రెండు చిత్రాలు చేయడానికి పచ్చజెండా ఊపేశారు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం.
ఈ సంస్థ ఇంతకుముందు రజనీకాంత్ హీరోగా 2ఓ చిత్రాన్ని నిర్మించింది. కాగా ప్రస్తుతం ఈ సంస్థ కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రజనీకాంత్ తాజాగా పచ్చజెండా ఊపిన రెండు చిత్రాలకు దర్శకత్వం వహించేది ఎవరన్నది ఆసక్తిగా, చర్చనీయాంశంగానూ మారింది. అందుకు కారణం లేకపోలేదు. రజనీకాంత్ నటించే 170వ చిత్రానికి డాన్ చిత్రం ఫేమ్ శిబిచక్రవర్తి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.
కాగా రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల శంకర్ ఆయన ఇంటికి వెళ్లి కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోసారి వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందా? అనే చర్చ జరుగుతోంది.
రజనీకాంత్, శంకర్ కాంబోలో ఇప్పటికే శివాజీ, ఎందిరన్, 2.0 చిత్రాలు వచ్చాయన్నది తెలిసిందే. కాగా ప్రస్తుతం శంకర్ ఇండియన్–2 చిత్రంతో పాటు తెలుగులో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆయన తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా రజనీకాంత్ను కలవడంపై తదుపరి చిత్రం ఆయనతో ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తుండటం సహజమే. వీటిపై స్పష్టత రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది.