వెంకటేశ్‌ ఎంట్రీతో నిర్ణయాన్ని మార్చుకున్న రజనీ!

10 Jul, 2021 13:33 IST|Sakshi

సూపర్ స్టార్ రజనీకాంత్, దృశ్యం రీమేక్ లో కనిపించాలనుకున్నారా...? మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను,రిపీట్ చేయాలనుకున్నారా? తలైవా తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది.మరి దృశ్యం రీమేక్ లో ఆయన కనిపించలేకపోయారు? అందుకు కారణం వెంకటేశ్‌ అట. 

మాలీవుడ్  డైరెక్టర్ జీతు జోసెఫ్ క్రియేట్ చేసిన వండర్ దృశ్యం. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలిభాగం తమిళం, కన్నడం, హిందీ, తెలుగు తో పాటు సిన్హాలా, అలాగే చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. 

దృశ్యం మొదటి భాగం రీమేక్ లో లోకనాయకుడు కమల్ హాసన్ నటించారు.అయితే కమల్ కంటే ముందే,ఈ రీమేక్ లో నటించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిని చూపించారు.అందుకు తగ్గట్లే తమిళ నిర్మాత కలైపులి థానుతో కలసి చర్చలు జరిపారు.అన్ని కుదిరి ఉంటే రజనీకాంత్ దృశ్యం తమిళ,తెలుగు రీమేక్ లో నటించాల్సింది. కాని వెంకటేశ్‌ ఎంట్రీతో సూపర్ స్టార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.

దృశ్యం మొదటి భాగానికి సంబంధించి తెలుగు,తమిళ భాషల్లో నటించేందుకు రజనీకాంత్ మొదట ఇంట్రెస్ట్ చూపించారు. కాని ఎప్పుడైతే వెంకటేష్ తెలుగు వర్షన్ కు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేయడం , షూటింగ్ కూడా స్టార్ట్ చేసారని తెలియడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. తెలుగు , తమిళ వర్షన్స్ కలిపి దృశ్యం మొదటి భాగంలో నటించాలనుకున్నారు రజనీకాంత్. అప్పుడే తమ ప్రాజెక్ట్ వల్ల నిర్మాతకు లాభం ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్క తమిళ రీమేక్ కు మాత్రమే అయితే నో అని చెప్పారట. 

ఇక సూపర్ స్టార్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్  వైపు  చూస్తే,ఈ దీపావళికి అన్నాత్తే అనే కొత్త చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అమెరికా వెళ్లారు తలైవా.ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యారు తలైవా.వచ్చి రావడంతోనే అన్నాత్తే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు రజనీకాంత్. 

మరిన్ని వార్తలు