రజనీకాంత్తో ‘2.0’,(2018) ‘దర్బార్’ (2020) వంటి చిత్రాలు తీసిన కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీతో మళ్లీ రెండు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల పూజా కార్యక్రమాలు ఈ నెల 5న చెన్నైలో జరగనున్నాయి. రజనీ కెరీర్లో 170, 171వ చిత్రాలుగా రూపొందనున్న ఈ సినిమాల దర్శకుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సిబి చక్రవర్తి, దేసింగు పెరియస్వామి పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ 170వ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఐశ్వర్య ఇప్పటికే ‘3’(2012), ‘వేయ్ రాజా వేయ్’(2015) చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఇక తన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ ‘కోచ్చడయాన్’ (2014) అనే సినిమా చేశారు.