‘రాక్షసుడు 2’ చిత్రానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా!

2 Aug, 2021 12:44 IST|Sakshi

గతంలో సినిమాకి 50 కోట్లు అంటే భారీ బడ్జెట్‌ అనుకుని ఖర్చుకు కాస్త ఆలోచించే నిర్మాతలు, బాహుబ‌లి చిత్రం బాక్స్‌ఫీస్‌ ఫలితాలు వాళ్ల లెక్కలన్నీ మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా కథ డిమాండ్‌ చేస్తే భారీగానే ఖర్చు పెట్టేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు.  బెల్లంకొండ శ్రీనివాస్, రమేష్ వర్మ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రాక్షసుడు’ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే.


తాజాగా ఈ హిట్‌ మూవీకి సీక్వెల్‌గా రాక్ష‌సుడు 2 రాబోతున్నట్లు ప్రకటించిన ఆ చిత్ర నిర్మాత అందుకు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించాడు.  ‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రం సీక్వెల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌న్నారు. అలానే ఇందులో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను కూడా జత చేస్తున్నామని,  హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ హిట్‌ మూవీకి సీక్వెల్‌లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు.

ఇందుకోసం సుమారు 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, సినిమా పూర్తిగా లండన్‌లో షూటింగ్‌ జరపనున్నట్లు చెప్పారు. ఇటీవ‌ల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుద‌ల చేసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆస‌క్తిని పెంచారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ రూపొందనుంది. గిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘ఖిలాడీ’ చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు