ఎన్‌సీబీ రకుల్‌ విచారణలో ఏం చెప్పింది?

26 Sep, 2020 14:34 IST|Sakshi

సాక్షి, ముంబై : సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్‌ కేసును నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని కస్టడీలో తీసుకుని విచారిస్తుండగా.. టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ విచారణ శుక్రవారం ముగిసింది. బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ద కపూర్‌, సారా అలీఖాన్‌లు విచారణకు హాజరయ్యేకుందుకు శనివారం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే శుక్రవారం నాటి విచారణలో భాగంగా రకుల్‌పై ఎన్‌సీబీ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. రియాతో పరిచయం ఎప్పటి నుంచి, ఎలా, సుశాంత్‌తో పార్టీ, వాట్సప్‌ చాటింగ్‌ వంటి అంశాలపై లోతైన ప్రశ్నలు సంధించారు. అయితే విచారణలో రకుల్‌ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. (సుశాంత్‌ కోసం సోదరుడితో డ్రగ్స్‌ తెప్పించిన రియా)

వాట్సప్‌ గ్రూప్‌తో తాను చాటింగ్‌ చేసింది నిజమేనని, కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేనది చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో​ భాగంగానే అనుమానితుల ఇళ్లలో ఎన్‌సీబీ నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్‌ బయటపడ్డ విషయం తెలిసిందే. రకుల్‌ నివాసంలో మాదక ద్రవ్యాలు వెలుగుచూడగా.. వీటపై ఎన్‌సీబీ ప్రశ్నించింది. తాను రియాతో డ్రగ్స్‌ గురించి చర్చించింది వాస్తమేనని, తన ఇంట్లో ఉన్న డ్రగ్స్‌ కూడా రియాకు చెందినవే అని వెల్లడించినట్లు ముంబై వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా డ్రగ్స్‌తో సంబంధమున్న మరో నలుగురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు కూడా రకుల్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. వారెవరు అనేది తెలియాల్సి ఉంది.

మరోవైవు దీపిక పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్ సైతం శుక్రవారం ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వచ్చారు. కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక శనివారం విచారణకు హాజరైన దీపిక, శ్రద్దా, సారాను అధికారులు విచారిస్తున్నారు. సుశాత్‌ సింగ్‌ మరణం తదనంతరం వెలుగుచూసిన డ్రగ్స్‌ వినియోగం వంటి అంశాలపై వీరిని ప్రశ్నిస్తున్నారు. వీరందరిని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్న అధికారులు వాటిలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక కేసు విచారణ నిమిత్తం కరుణ్‌ జోహార్‌కు ఎన్‌సీబీ నోటీసులు పంపే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు