వికారాబాద్‌ అడవుల్లో రకుల్‌..

12 Sep, 2020 15:37 IST|Sakshi

బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్‌ ప్రకంపనలు శాండిల్‌వుడ్‌ మీదుగా టాలీవుడ్‌కు పాకాయి. ఈ కేసులో ఇప్పటికే నటి రియా చక్రవర్తి అరెస్ట్‌ కాగా.. ఆమె వెల్లడించిన 25 మందికి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేందుకు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రియా బయటపెట్టిన జాబితాలో టాలీవుడ్‌ తారా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు కుడా ఉందని వస్తున్న వార్తలు టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. రకుల్‌ కూడా డ్రగ్స్‌ వాడుతుందంటూ వస్తున్న పుకార్లపై ఆమె స్నేహితులతో పాటు సన్నిహితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు?)

ఈ నేపథ్యంలో గతవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రకుల్‌ ప్రస్తుతం ఎక్కడుందనే అన్వేషణ ప్రారంభం అయ్యింది. ఓవైపు డ్రగ్స్‌ కేసు రచ్చ సాగుతుండగా రకుల్‌ మాత్రం తన సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం కూడా షూటింగ్‌కు వచ్చిన రకుల్‌.. డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిని జూబ్లీహిల్స్‌ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్‌ మేనేజర్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారు. (డ్రగ్స్‌ కేసులో రియాకు షాక్‌)

కాగా రియా వెల్లడించిన 25 మందికి నోటీసులు జారీచేసే ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు నార్కోటెక్‌ కంట్రోల్‌ బ్యూరో శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుంది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలను ఎదర్కొంటున్న వారికి నోటీసులు పంపిన అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్‌లో రియా అరెస్ట్‌తో మొదలైన పర్వం బెంగళూరులో బుజ్జిగాడు బ్యూటీ సంజనా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మందిని కూడా ఎన్‌సీబీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీ మ్యానియాలో కొనసాగుతూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారి గుండెళ్ల రైళ్లు పరిగెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు