చరణ్‌తో శంకర్‌ మూవీకి లైన్‌ క్లియర్‌, త్వరలోనే సెట్స్‌కు

5 Jul, 2021 07:48 IST|Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీలో రామ్‌చరణ్‌ పోలీసాఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారే యువకుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్‌ 2’ సినిమా వివాదంలో చిక్కుకున్న శంకర్‌కు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఊరటనిచ్చాయి. దీంతో రామ్‌చరణ్‌తో శంకర్‌ చేయనున్న ఈ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.

రామ్‌చరణ్, శంకర్, దిల్‌ రాజులు తాజాగా సమావేశమై ఈ సినిమా గురించి చర్చించుకున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో.. కుదిరితే ఆలోపే ప్రారంభించాలనుకుంటున్నారట శంకర్‌. ఇలా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్లాన్‌ను పక్కాగా రెడీ చేసే పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారాయన. కాగా ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఖారారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్‌-కియారా అద్వానీ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు