Ram Charan: క్రికెట్‌ టీమ్‌ కొనుగోలు చేయనున్న చరణ్‌, ఐపీఎల్‌లోనా? ఏపీఎల్‌లోనా?

6 May, 2023 19:44 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌తో మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ ఇమేజ్ ప్రపంచస్థాయికి చేరింది. మెగాస్టార్ వారసుడిగానే అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్‌చరణ్‌ కేవలం హీరోగానే కాదు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ మెగా హీరోకి పోలో టీమ్‌ ఉండగా.. ట్రూజెట్‌ పేరుతో ఎయిర్‌లైన్స్‌ రంగంలోనూ అడుగుపెట్టాడు. సహజంగా స్పోర్ట్‌పైనా ఇంట్రెస్ట్‌ ఉండే రామ్‌చరణ్ ఇప్పుడు క్రికెట్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. చెర్రీ ఐపీఎల్‌లో టీమ్ కొనుగోలు చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్‌గా ఉంది. ఇది కూడా తమిళనాడుకు చెందిన కావ్యా మారన్ ఓనర్‌గా ఉంటే.. ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ ప్రాతినిథ్యం లేదు. దీంతో రామ్‌చరణ్‌ ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి వైజాగ్ వారియర్స్‌ అనే పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఐపీఎల్‌లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదు. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు.

గుజరాత్‌ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్స్, లక్నో టీమ్‌ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశమైతే బీసీసీఐకి లేదు. దీంతో రామ్‌చరణ్ ఐపీఎల్‌లో టీమ్‌ ఎలా కొనుగోలు చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రామ్‌చరణ్‌ కొనబోయేది ఐపీఎల్ కాదు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్‌)లో అనీ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో యువక్రికెటర్లను ప్రోత్సహించే ఉద్ధేశంతో గత ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ ప్రారంభమైంది. తొలి సీజన్‌ కూడా విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్‌లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్‌ ద్వారా పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. రామ్‌చరణ్‌ ఏపీఎల్‌లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీనిపై వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. 

తాజాగా వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్స్‌ శ్రీనుబాబు, నరేంద్ర రామ్‌, సీఈవో  భరణిలని మీడియా వర్గాలు ప్రశ్నించగా... రామ్‌చరణ్‌ లాంటి స్టార్ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌లో భాగమయితే చాలా సంతోషిస్తామనీ, లీగ్‌కు, ఇందులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇది ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైజాగ్ వారియర్స్ సీఈవో భరణి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్ళకు ఏపీఎల్‌ గొప్ప వేదిక అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి లీగ్‌లో రామ్‌చరణ్ లాంటి టాప్ హీరో ఎంట్రీ ఇస్తే గ్లోబల్‌ వైడ్‌గా గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.

చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఏడాదిన్నర ఇంట్లోనే కూర్చున్నా: బెల్లంకొండ హీరో

మరిన్ని వార్తలు