చెర్రీ కోసం 231 కి.మీ పాద​యాత్ర.. ఫిదా అయిన మెగా హీరో

25 Jun, 2021 17:08 IST|Sakshi

సినిమా హీరోలపై అభిమానులు ఒక్కో రకంగా తమ ప్రేమను వెలిబుచ్చుతారు. కొంతమంది తనకు నచ్చిన హీరో, హీరోయిన్ల పేర్లను టాటూ వేయించుకుంటారు. మరికొంతమంది దైవంలా ఆరాధిస్తూ పూజలు చేస్తారు. తమ అభిమాన హీరో పేరిట సేవా కార్యక్రమలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రేమను చూపిస్తారు. ఇక అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు. తమ ఫేవరేట్‌ హీరోని ప్రత్యేక్షంగా కలుసుకోవడం కోసం పాదయాత్రలు చేస్తుంటారు. ఇలా చేయడం ఇటీవల కామన్‌ అయిపోయింది. ఇప్పటికే సోనూసూద్‌ కోసం కొంతమంది పాదయాత్ర చేస్తూ ముంబై వెళ్లారు. హీరోయిన్‌ రష్మికను చూసేందుకు ఓ అభిమాని అయితే ఏకంగా 900 కిలో మీటర్లు ప్రయాణం చేసి కర్ణాటకకు వెళ్లాడు. ఇక  తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం అభిమానులు పాదయాత్రను చేశారు. కాలినడకన 231 కిలో మీటర్లు నడిచి చెర్రీని కలిశారు. 

జోగులాంబకు చెందిన సంధ్య జయరాజ్, రవి, వీరేశ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలవాలనుకున్నారు. అందుకోసం జోగులాంబ జిల్లా నుంచి 4 రోజుల క్రితం బయల్దేరారు. మొత్తం 231 కిలో మీటర్లు నడిచి హైదరాబాద్ చేరుకున్నారు.శుక్రవారం మధ్యహ్నం రామ్ చరణ్ తేజ్‌ను కలిశారు. ఇక అంతదూరం వచ్చిన అభిమానులను ఆత్మీయ ఆలింగనం చేసుకొని సంతృప్తి పరిచాయడు చెర్రీ. కాసేపు వారితో ముచ్చటించి, సెల్పీలు ఇచ్చి పంపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు