Heros In Student Roles: స్టూడెంట్స్‌గా హీరోలు.. ప్రేక్షకులే ఇన్విజిలేటర్లు

21 Jun, 2022 07:19 IST|Sakshi

మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్‌ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్‌ పరీక్షల్లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్‌ డేట్స్‌ (రిలీజ్‌ డేట్స్‌) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్‌ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్‌ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్‌ సినిమా కోసమే. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌ పాత్రలో షేడ్స్‌ ఉంటాయి. స్టూడెంట్‌ లీడర్, ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది. 

మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా, అవికా గోర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్‌ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్‌ స్కూల్‌ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్‌ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. 

ఇంకోవైపు ఆది, సత్యదేవ్‌ కూడా స్టూడెంట్‌ రోల్స్‌ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్‌. నాగశేఖర్‌ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్‌ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్‌ కానుంది. ఇక ‘తీస్‌మార్‌ ఖాన్‌’ కోసం ఆది సాయికుమార్‌ స్టూడెంట్‌ అవతారం ఎత్తారు. కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్‌.. ఇలా త్రీ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశారు ఆది సాయికుమార్‌.  

ఇక  ‘ఉప్పెన’ ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’.  ఇది కంప్లీట్‌ క్యాంపస్‌ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్‌ స్టూడెంట్స్‌ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్‌ తేజ్, హీరోయిన్‌ కేతికా శర్మ. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్‌ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు