వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన చిత్రాన్ని ప్రకటించాడు. "అల్లు" అనే ఫిక్షనల్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయన బామ్మర్ది ఏం చేశాడనేది ఈ సినిమాలో చూపిస్తామని తెలిపారు. 'జన రాజ్యం' పార్టీని స్థాపించడంతో కథ మొదలు అవుతుందని మరో బాంబు పేల్చారు. ఈ సినిమాకు అల్లు అని పెట్టడానికి కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర రకారకాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామన్నారు. ‘తనకు మంచి జరగాలంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలంటే ప్లాన్ అల్లు.. అనే స్ట్రాటజీతో ప్లాన్ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి అల్లుడును కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు. (బిగ్బాస్ 4: కెమెరా, యాక్షన్ వాట్ ఏ వావ్..)
అందరితో తనను 'ఆహా' అనిపించుకోడానికి తనకు కావాల్సిన వాళ్లకే మంచి జరిగేలా చెప్పి, ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ అల్లు’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని పాత్రల పేర్లను కూడా వెల్లడించారు. ఈ సినిమాలో ఎ.అరవింద్, కె.చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎ.అర్జున్, ఎ.శిరీష్, కె.ఆర్.చరణ్, ఎన్.బాబు తదితరులు ఉంటారని తెలిపారు. ఇక ఈ చిత్రం మెగా ఫ్యామిలీ వారి అల్లు అరవింద్ గురించి తీస్తున్నట్లు ఈ పాటికే అర్థమైందంటూ నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. అయితే తనకు ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, తనను నికృష్టుడు అని పిలిచిన అల్లు అరవింద్పై ప్రతీకారం కాదని వర్మ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి పవన్ కల్యాణ్ను లాగమని చెప్పింది తానేనని వర్మ ప్రకటించారు. దీంతో అల్లు అరవింద్ ఆర్జీవీని నికృష్టుడు, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. (ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్)