రామ్‌గోపాల్‌‌ వర్మకు షాక్..‘మర్డర్‌’కు బ్రేక్‌

24 Aug, 2020 14:36 IST|Sakshi

ప్రముఖ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమా కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది.
(చదవండి : న‌టి ఇంట్లో విషాదం)

కాగా,ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. దీనితో పాటు రెండు పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఓ పాటను స్వయంగా వర్మనే పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు