Ram Gopal Varma: ‘దహనం’ చేయనున్న రామ్‌గోపాల్‌ వర్మ 

3 Apr, 2022 21:16 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ యాక్షన్‌  థ్రిల్లర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి  లేదు. హిట్‌, ప్లాప్‌తో సంబంధం లేకుండా నిజ జీవితంలో జరిగిన సంఘటనలను వర్మ తెరకెక్కిస్తుంటాడు. తాజాగా ఆయన పూర్తి యాక్షన్‌  కథాంశంతో తిరిగి వస్తున్నాడు. దహనం పేరుతో తన స్వంత నిర్మాణ సంస్ధలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ను తీసుకురాబోతున్నాడు. ఈ సిరీస్‌కు ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక ఎంఎక్స్‌ ప్లేయర్‌లో తాజాగా విడుదల చేశాడు వర్మ. ఈ వెబ్‌సిరీస్‌కు  అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.  ఇది ఏడు ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. దీనిలో ఇషా కొప్పికర్, అభిషేక్‌, నైనా గంగూలీ, అశ్వత్‌ కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే మరియు ప్రదీప్‌ రావత్‌లు కీలక పాత్రల్లో నటించారు. అన్ని ఎపిసోడ్లనూ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ఈనెల 14  నుంచి ప్రసారం చేయనున్నారు.

ప్రతీకారమే...కథాసారం..
ఈ వెబ్‌సిరీస్‌ కథను అసాంతం ప్రతీకారం, రక్తపాతం, హింస  నేపథ్యంతో తీర్చిదిద్దారు. తన  తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. .  ఓ కమ్యూనిస్ట్‌ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.అది గ్రామంలో ఏ విధంగా సంచలనంగా మారింది చెబుతారు. శ్రీరాములు పెద్ద కొడుకు హరి, ఓ విప్లవకారుడు (నక్సలైట్‌). అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని  భుస్వాములతో చేస్తుంటాడు. తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గుండాలకు, అతనికి జరిగే పోరాటమే ఈ కధ.  దీనికి తోడు నక్సలైట్ల ఆధిపత్యం గ్రామంలో  పెరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలూ పెరుగుతాయి. కోడుకు తండ్రి హత్యకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేదే కధాంశం. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు