Ram Gopal Varma: ‘ఆశ: ఎన్ కౌంటర్’ సినిమా దిశ గురించి కాదు

30 Dec, 2021 14:34 IST|Sakshi

వాస్తవి​క సంఘటనల ఆధారంగా కల్పిత కథతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో వస్తున్న సినిమా ‘ఆశ: ఎన్ కౌంటర్’. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా, అనురాగ్ కంచర్ల నిర్మాతగా వ్యవహరించాడు. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ ఘటన ఆధారం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా దిశ గురించి కానేకాదంటూ చెప్పుకొచ్చారు. దేశంలో జరిగిన అఘాయిత్యాలన్నింటిని ఈ సినిమాలో చూపించారన్నారు. ‘‘ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం కావొచ్చు.. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన కావొచ్చు. దేశంలో ఎప్పుడూ ప్రతి చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఆ ఘటనలన్నింటినీ సినిమాలో చూపించాం. ప్రత్యేకంగా ఓ అమ్మాయి మీద జరిగిన ఘటనే కాదు’’ అని ఆర్జీవీ చెప్పారు.

అన్ని ఘటనల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంటుందని, ఒంటరిగా అమ్మాయి కనిపించగానే గ్యాంగ్‌లు ప్లాన్ చేసి అత్యాచారాలకు పాల్పడుతుంటాయని అన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి అత్యాచారాలు దేశమంతటా జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, ఘటనకు ముందు వరకు నిందితులంతా అందరిలాగే మామూలు మనుషులని, ఎలాంటి నేర చరిత కూడా ఉండదని అన్నారు. కానీ, ఘటన జరిగిన రోజు మాత్రం నిమిషాల్లో వాళ్లంతా రాక్షసుల్లాగా మారిపోతున్నారన్నారు. వాళ్లకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది?

అప్పటిదాకా బాగున్నావారంతా రాక్షసుల్లా ఎలా మారారు? అనేది తెలుసుకోకుండా.. వారిని కాల్చి చంపేస్తే అది పోలీస్ స్టేట్ అయిపోదా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. సినిమా కథకంటూ పరిధులు పెట్టుకున్నాక ఆ పరిధి దాటి ఏ డైరెక్టర్ వెళ్లలేడని, అలాంటప్పుడు ఆ కథను తాను తీసినా, వేరే డైరెక్టర్ తీసినా పెద్దగా మార్పేమీ ఉండదని తెలిపారు. సినిమాలో రేప్ ఎపిసోడ్ 45 నిమిషాలు ఉంటుందని, ఆ తర్వాత ఆమెను చంపి, శవాన్ని మాయం చేయడం, నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వంటి సన్నివేశాలుంటాయని చెప్పారు.

మరిన్ని వార్తలు