Ram Pothineni: మొదట పోలీసు పాత్రలు వద్దనుకున్నా.. కానీ

11 Jul, 2022 08:39 IST|Sakshi
శ్రీనివాసా చిట్టూరి, ఎంపీ మార్గాని భరత్, లింగుసామి, రామ్, కృతి శెట్టి

‘‘కరోనా వల్ల రెండేళ్లు సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ‘వారియర్‌’ లాంటి సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి. రామ్, కృతీశెట్టికి ఆల్‌ ది బెస్ట్‌. శ్రీనివాసా చిట్టూరిగారు మంచి స్నేహితులు.. ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. రామ్‌ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో రామ్‌ మాట్లాడుతూ.. ‘‘పోలీస్‌ పాత్ర చేద్దామని చాలా కథలు విన్నా. అన్నీ ఒకేలా అనిపించడంతో కొద్ది రోజులు పోలీస్‌ పాత్ర వద్దనుకున్నాను. ఆ సమయంలో లింగుసామిగారు ‘ది వారియర్‌’ కథ చెప్పాక, ‘పోలీస్‌ కథ చేస్తే ఇలాంటిదే చేయాలి’ అనిపించింది. ఇందులో ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. కథ విన్నాక నేనెప్పుడూ ట్వీట్‌ చేయలేదు.. తొలిసారి ఈ సినిమా కోసం ట్వీట్‌ చేశాను. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఇలాంటి అద్భుతమైన కథ రాసిన ఆయనకి హ్యాట్సాఫ్‌. మీరు(అభిమానులు) లేకుంటే నేను లేను. నా ప్రతి ఎనర్జీ మీ వల్లే వచ్చింది’’ అన్నారు.

డైరెక్టర్‌ లింగుసామి మాట్లాడుతూ.. ‘‘రన్‌’ సినిమా తర్వాత నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లు నన్ను కలిసి ఓ సినిమా చేద్దామన్నారు.. ఇప్పటికి కుదిరింది. సెట్‌లో ప్రశాంతంగా ఉంటారు.. అదే వారి బలం. ఒక డైరెక్టర్‌ ఎలా ఆలోచిస్తాడో దానికి ఎలా న్యాయం చేయాలా? అని ఆలోచించే రామ్‌ నాకు దొరకడం నా అదృష్టం. అన్నీ కుదిరితే తనతో ఓ పది సినిమాలు చేయాలనుకుంటున్నా. చాలా రోజులుగా తెలుగులో నేరుగా ఓ సినిమా చేద్దామనుకుంటున్నా. ‘ది వారియర్‌’ సినిమా నాకు వందశాతం కరెక్ట్‌ ఎంట్రీ. ఇదే బ్యానర్‌లో ‘వారియర్‌ 2’ సినిమా కూడా ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు హరీష్‌ శంకర్, కిశోర్‌ తిరుమల, నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్,  వివేక్‌ కూచిభొట్ల, కృష్ణ, సినిమాటోగ్రాఫర్‌ సుజీత్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు